EPFO Unorganized Sector :
భారతదేశంలో అసంఘటిత రంగంలో (Unorganized Sector) పనిచేస్తూ, ఎలాంటి సామాజిక భద్రత లేకుండా శ్రమిస్తున్న కోట్లాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సన్నద్ధమవుతోంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కేవలం సంఘటిత రంగానికే (Organized Sector) పరిమితమైన ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (EPFO), ‘ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ’ (ESIC) సేవలను అసంఘటిత రంగ కార్మికులకు కూడా విస్తరించే అంశంపై కేంద్రం సీరియస్గా కసరత్తు చేస్తోంది.

లోక్సభ వేదికగా ప్రకటన :
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ కీలక (EPFO) ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చారు. దేశంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను (Pension) అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమని ఆమె సభకు వివరించారు.
కార్మిక శాఖ ముందున్న ప్రధాన లక్ష్యాలు :
సామాజిక భద్రత (Social Security) : ఎటువంటి ఉద్యోగ భద్రత లేని అసంఘటిత రంగ కార్మికులకు ఈపీఎఫ్వో (EPFO) ద్వారా భవిష్య నిధి, ఈఎస్ఐసీ ద్వారా మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడం.
పింఛను సదుపాయం: వృద్ధాప్యంలో కార్మికులకు కచ్చితమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్ సదుపాయాన్ని విస్తరించడం. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖలో ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులతో విస్తృత చర్చలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.