March 25, 2026

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు, రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. వాతావరణశాఖ అధికారుల ప్రకారం.. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురివచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు, రైతుకూలీలు పొలాల్లో, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరారు. ఇంట్లో ఉన్నప్పుడు టీవీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్‌కనెక్ట్ చేయడం మంచిదని సూచించారు. రైతులు ఆరుబయట ఆరబోసిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలపై వెంటనే పట్టాలు కప్పి భద్రపరచుకోవాలి.వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)