AP Housing Scheme :
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇళ్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2029 నాటికి అర్హులైన 7.5 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని, జూన్ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని ప్రకటించింది.
సొంతిల్లు అనేది సామాన్యుడి జీవితకాల స్వప్నం. ఆ కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో ఇళ్ల నిర్మాణ పథకాలపై తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సుమారు 7.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ 2029 నాటికి శాశ్వత నివాసాలను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటి స్థలం లేని మరో 2.65 లక్షల మందికి అదే కాలపరిమితిలో స్థలాలను కేటాయించి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం అవాస్ యోజన (PMAY) పథకాన్ని రాష్ట్ర పథకాలతో అనుసంధానించి లబ్ధిదారులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కింద కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారికి సుమారు రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది. దీనికి తోడు బ్యాంకు రుణాల సదుపాయం కల్పించడం ద్వారా పేదలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రభుత్వ సాయం నిజమైన పేదలకే అందాలన్న ఉద్దేశంతో, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించనున్నారు. ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా, కేవలం అర్హత ప్రాతిపదికన మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సొంతింటి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న సామాన్యులకు ప్రభుత్వ తాజా ప్రకటన కొండంత ఆశను కల్పిస్తోంది. నిర్దేశించిన గడువులోగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే, ఏపీలో నిరుపేదల సొంతింటి కల సాకారమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతీ కుటుంబానికి పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం అని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇకపోతే 2026-27ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు రూ.6357 కోట్లు మేర కేటాయింపులు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి
సుమారు 6 లక్షల లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎస్సీ,బీసీ వర్గాలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.