EPFO BIG ALERT :
ఆన్లైన్లో EPFO పేరుతో పలు నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. అందరు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎక్స్లో భవిష్య నిధి సంస్థ కోరింది. ఈ మేరకు EPF ఖాతాదారులకు పలు సూచనలు జారీ చేసింది.

ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చాలామందికి ఈపీఎఫ్ఓ ఖాతా అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా ఉద్యోగులు తమ ఖాతాను నిర్వహించుకుంటారు. బ్యాలెన్స్ చెకింగ్, పీఎఫ్ విత్ డ్రా, కేవైసీ అప్డేట్, పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ వంటివి పీఎఫ్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. ఈ క్రమంలో పీఎఫ్ వెబ్సైట్కు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్ జారీ చేసింది. ఇటీవల ఈపీఎఫ్ఓ పేరుతో పలు నకిలీ లింకులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఇవే నిజమైన వెబ్సైట్లుగా భావించి వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు పంచుకుంటున్నారు. దీంతో బ్యాంకులోని డబ్బులన్నీ సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓను పోలి ఉన్న నకిలీ లింకులతో జాగ్రత్తగా ఉండాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
ఇలాంటి లింకులు క్లిక్ చేసే ముందు జాగ్రత్త :
లింకులను క్లిక్ చేసే ముందు ఆలోచించండి! ఆన్లైన్లో అప్రమత్తంగా ఉండండి. నకిలీ లింక్లను నివారించండి. క్లిక్ చేసే ముందు URLలను CHECK చేసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోండి అంటూ EPFO పేర్కొంది. ఈ మేరకు పలు సూచనలను జారీ చేసింది. https://www.epfindia.gov.in, https://www.epfo.gov.in/,. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్లు మాత్రమే అధికారికమైనవని, మిగతా పేరుతో ఉన్న లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. మొబైల్ ఎస్ఎంఎస్, ఈమెయిల్, సోషల్ మీడియాలో షేర్ చేసే అనధికార లింకులు క్లిక్ చేయవద్దని కోరింది. ఇలాంటి వెబ్సైట్లలో మీ యూఏఎన్ నెంబర్, పీవీవో, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటివి అందించవద్దంది.
ఓపెన్ చేసేముందు ఒక్కసారి చెక్ చేస్కోండి :
EPFO పేరుతో ఉండే వెబ్సైట్లు ఓపెన్ చేసేముందు URL, స్పెల్పింగ్లో తేడాలు వంటివి గమనించాలని భవిష్య నిధి సంస్థ తెలిపింది. ఫిషింగ్ లింకులు, వెబ్సైట్లు, మెస్సేజ్లపైEPFO HELP DESK లో ఫిర్యాదు చేయాలని కోరింది. ఫోన్ కాల్స్, వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా ఈపీఎఫ్వో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, లాగిన్ వివరాలు అడగదని సూచించింది. అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈపీఎఫ్ఓ ఖాతాను కాపాడుకోవాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ వెబ్సైట్లలో పోలి ఉన్న నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పోర్టల్స్ ద్వారా వివరాలు సేకరించి డబ్బులు కాజేస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఉద్యోగులను EPFO కోరుతుంది. క్లిక్ చేసే ముందు CHECK చేసుకోవాలని చెబుతోంది. తొందరపాటు నకిలీ వెబ్సైట్లను క్లిక్ చేయవద్దని కోరుతోంది.