March 21, 2026

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్. కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్‌వో కొత్త వ్యవస్థ 3.0 గురించి ప్రకటించింది. ఈ వ్యవస్థతో పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగింది. ఇక నుంచి అన్నీ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవ్వడంతో పాటు ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై జరగనున్నాయి.

ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. ఈపీఎఫ్‌వో 3.0 వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. దీని గురించి పార్లమెంట్‌లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్‌వో 3.0లో ఎలాంటి మార్పులు ఉంటాయనే దానిపై పార్లమెంట్‌లో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శోభా కరంద్లాజే కీలక విషయాలను ప్రస్తావించారు. పీఎఫ్, పెన్షన్ సేవలను వేగవంతంగా, సులభతరంగా అందించేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త విధానంలో పేపర్ లెస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించే ప్రాసెస్‌కు స్వస్తి పలికినట్లు స్పష్టం చేశారు. ఆటోమేషన్ పద్దతిలో సేవలు అందించే పద్దతిని ప్రవేశపెట్టామన్నారు. సభ్యులు ఏకీకృత ఫ్లాట్‌ఫామ్ ద్వారా తమ అకౌంట్లను నిర్వహించుకోవచ్చని, కాగితపు పనిని తగ్గించడానికి సేవలను క్రమబద్దీకరించినట్లు పేర్కొన్నారు.

ఇక ఇక జూన్ 2025 నుంచి ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్‌లు ఇక నుంచి ఆటో సెటిల్మెంట్ అవుతాయి. ఇప్పటివరకు 3.52 కోట్ల క్లెయిమ్‌లు ఈ విధానంలో పరిష్కరించారు. ఇక 71.37 శాతం క్లెయిమ్‌లు ఆటో మోడ్‌లో పంపిణీ చేశారు.

ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా కేంద్రీకృత పింఛన్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 1 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. పింఛన్ గతంలో కొన్ని బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేసేవారు. కానీ ఇక నుంచి ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారా అయినా పింఛన్ పొందవచ్చు. దీని వల్ల ప్రతీ నెలా 70 లక్షలకుపైగా పించన్‌దారులు లబ్ది పొందుతున్నారు. వేగవంతమైన చెల్లింపులు దీని ద్వారా జరగనున్నాయి. ఇక పెన్షన్ పొందటంలో జాప్యాలు, లోపాలను ఇది తగ్గిస్తుంది.

ఇక పీఎఫ్ బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఇక నుంచి యాజమాన్యం అనుమతి లేకుండా బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల బదిలీ క్లెయిమ్‌లు మాన్యువల్‌గా దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కేవైసీ పూర్తి చేసినవారికి యజమాని ఆమోదం లేకుండా బదిలీలు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. కాగా ఇప్పటివరకు 70.5 లక్షలకుపైగా బదిలీ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ప్రారంభమయ్యాయి. ఇక 21.39 లక్షల బదిలీలు యజమాని ప్రమేయం లేకుండా జరిగాయి. దీని వల్ల ఉద్యోగులు మారినప్పుడు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చుకోవడం సులువైంది. అటు పెన్షప్ పరిమితి పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్లమెంట్‌లో కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)